హిందూ తాత – సెక్యులర్ మనవడు – 4
Sunday, November 16, 2008 15:56మనవడు: తాతా, ఈ భీష్ముడి సంగతి కొంచెం తేలుస్తావా?
తాత: శత్రువులకు మరణ రహస్యం చెప్పాడని, అది దేశ ద్రోహం అని భీష్ముడి మీద ఒక అభియోగం. దీని పూర్వాపరాలు కొంచెం చూద్దాం.
- అప్పటికి 9 రోజుల యుద్ధం ముగిసింది. ఇరుపక్షాలవైపూ విపరీతమైన సైన్య నష్టం జరిగింది. పాండవుల్లో ఒక నిరాశ అలముకుంది. భీష్ముడు ఆయుధం ధరించి ఉండగా విజయం చేజిక్కే మార్గం అసంభవం అని వాళ్ళకు స్పష్టం అయ్యింది.
- ఉన్నాడుగా నల్లనయ్య. వెళ్ళి మీ తాతకు అతనిచ్చిన ఆశీర్వాదం వెనక్కి ఇచ్చెయ్యి అన్నాడు ధర్మజుడితో. యుద్ధం ప్రారంభింపబడినప్పుడు వెళ్ళి నమస్కరిస్తే విజయీభవ అని అందించిన ఆశీర్వాదం వెనక్కి ఇచ్చేయి అని ధర్మజుడిని ఆదేశిస్తాడు. ధర్మరాజు వెళ్ళి ఇవే చిలకపలుకులు పలికితే భీష్ముడు అడుగుతాడు. ఇప్పుడెందుకు ఇలా వచ్చావని. ధర్మజుడు కారణం చెపితే, కృష్ణుడు పంపించాడా అని అడిగి, శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యమని చెప్తాడు.
- ఇక్కడ భీష్ముడి ధర్మ నిబద్ధతను ప్రశ్నించేముందు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే కృష్ణుడు వెళ్ళి భీష్ముడిని ఎందుకు అడగమన్నాడు అని.
- కృష్ణుడికి తెలుసుగా శిఖండి భీష్ముడి చావుకి కీలకం అని – ఆ ముక్క కృష్ణుడే చెప్పెయ్యచ్చుగా. పోనీ, శిఖండి పాండవ శిబిరంలోనే యుద్ధం చేస్తున్నాడుగా – తనొచ్చి నన్ను భీష్ముడు ఎదుర్కోడు అన్న విషయం అనచ్చుగా. మర్నాడు యుద్ధారంభంలో దుర్యోధనుడంటాడు శిఖండి కనపడితే పితామహుడు ఆయుధం వదిలేస్తారు – మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఇవన్నీ ఎందుకు చెపుతున్నాను అంటే భీష్ముడు పెద్ద రహస్యం ఏమీ చెప్పేయలేదు. అప్పటికి అది బహిరంగరహస్యమే.
- అయితే కృష్ణుడు ధర్మజుడిని వెళ్ళి పితామహుని అడిగిరమ్మనడంలో ఆంతర్యం ఏమిటంటే – పితామహుని అనుమతి తీసుకురమ్మని. తాతా, ఇలా చేస్తున్నాము. హస్తినాపుర రక్షణకి నీకింకేదైనా మార్గం ఉందా? లేదంటే ఇలా చెయ్యడానికి నీ అనుమతి కావాలి అని.
- భీష్ముడు కూడా కృష్ణుడు పంపాడని చెప్పాక ఆలోచనలో పడతాడు. కృష్ణుడు పంపినది తన మరణ రహస్యం తెలుసుకోమని పంపలేదు. తనకో ప్రశ్న పంపాడు అని అర్థం అయ్యింది. నీకు దుర్యోధనుడు ముఖ్యమా, హస్తినాపురం ముఖ్యమా అని కృష్ణుడు తేల్చుకోమని చెప్తున్నట్టు అర్థమయ్యింది.
- పాండవులు గెలుస్తారా, కౌరవులకి భీష్ముడు ద్రోహం చేసాడా ఇవన్నీ తరువాత జరిగేవి – ముందు జరిగేది భీష్ముడి ప్రాణం పోవడం. నన్నిలా చంపండిరా అని చెప్పగలగటం అసలు సాధ్యమేనా?
- ఏనాడూ భీష్ముడు రాజుకి తలవంచలేదు – రాజ్యానికి తప్ప. హస్తినాపురం అతని కర్మభూమి. కృష్ణుడు తనకి ఎంత మహదావకాశాన్నిచ్చాడో తెలుసుకున్న భీష్ముడి హృదయం ఆనందంతో పొంగిపోయింది.
- కృష్ణుడు ఇచ్చిన ఆ మహదావకాశం ఏమిటంటే భీష్మునికి హస్తినాపురం పట్ల తన నిబద్ధతని నిరూపించుకునే అవకాశం. అలాకాకుండా కృష్ణుడే విషయం చెప్పేస్తే మరునాటి యుద్ధంలో మామూలుగా భీష్ముడు ఆయుధాన్ని వదిలేసేవాడు. అప్పుడు అతని నిబద్ధత దుర్యోధనుడి పట్లగానీ, హస్తినాపురం పట్లకాదు అని చరిత్రలో నిలచిపోయేది.
- ఇక్కడ భీష్ముడి ముందు ప్రశ్న ఏమిటంటే తను పాండవులందరినీ చంపి దుర్యోధనుడికి విజయం చేకూర్చగలనా లేక కౌరవులందరినీ చంపి పాండవులకు విజయం ఇవ్వాలా అని. ఇద్దరూ ఉండడం అసంభవం – ఎందుకంటే అది సాధ్యమే అయితే యుద్ధం దాకా కథ వచ్చేదే కాదు. కృష్ణుడు ఆ పక్షంలో ఉండగా పాండవులని చంపగలిగే అవకాశమే లేదు. తనుండగా కౌరవులు ఓడిపోయే అవకాశమే లేదు. సుమారుగా చదరంగం పరిభాషలో చెప్పాలంటే స్టేల్ మేట్ అన్నమాట.
- హస్తినాపురం సురక్షితంగా ఉండాలంటే యుద్ధం ముగియడం తప్పనిసరి. ఇక్కడ భీష్ముడు చేసినదేమిటయ్యా అంటే తన దేశం కోసం ప్రాణత్యాగం. నిజంగా మనలో భీష్ముడనేవాడుంటే కొంచెంకొంచెంగా బతికి బయటకు వస్తే నిజంగా మన సమాజం, దేశం మరింత బాగుంటాయిగా.
- అలాగే భీష్ముడి మీద మరిన్ని సందేహాలు. ద్రౌపదీ వస్రాటహపహరణం లోనూ, అతడి ప్రాప్తకాలజ్ఞత మీదా, అంబ, అంబిక, అంబాలికల ఉదంతంలోనూ.
- ఉదాహరణకి అంబ, అంబిక, అంబాలికల గురించిన వృతాంతం తీసుకుందాం. సత్యవతి భీష్ముడిని అడుగుతుంది. నీ సోదరులిరువురూ మరణించారు. సోదరుని భార్యని నువ్వు వివాహమాడడం సంప్రదాయమే కదా! అలా చేసి భరత వంశాన్ని నిలబెట్టు అని. భీష్ముడంటాడు – నేను మాట ఇచ్చినది నా తండ్రికి, మరియూ నీ తండ్రి దాసరాజుకి. అమ్మగా నీ మాటని గౌరవించాలన్న నిబద్ధత నాలో ఎంతున్నా వారికిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. వారిద్దరూ లోకంలోనే లేరన్నది వేరే విషయం. నన్ను క్షమించు అంటాడు. అప్పుడు సత్యవతి అంటుంది – నా పుత్రుడు వ్యాసుణ్ణి పిలుచుకురా అంటుంది. ఇక్కడ భీష్ముడు వ్యాసుణ్ణి నియోగించలేదన్నది గమనించాల్సిన విషయం. భీష్ముడు వెళ్ళి సత్యవతి పిలవమన్నాది అని వ్యాసుణ్ణి పిలిస్తే అతడంటాడు – నీ తల్లి గంగ – సత్యవతి నీకు జన్మ నిచ్చిన తల్లిగాదు కాబట్టి ఆవిడ ఆజ్ఞని పాటించాల్సిన ధర్మం నీకు లేదు. కానీ నాకు ఆవిడ జన్మనిచ్చిన తల్లి. ఆవిడ ఆజ్ఞని నేను పాటించే తీరాలి అని బయలుదేరి వస్తాడు. అతడు సన్యాసి. అయినా అమ్మ మాట జవదాటరాదన్నది అతడు చేసిన ధర్మ నిర్దేశం. మనసు పెట్టి చదివితే కనిపిస్తుంది.
- అలాగే ద్రౌపదీ వస్త్రాహరణం. అయినా ఈ వివరణలన్నీ అనవసరం లెండి. ఎవరో అన్నట్టు జ్ఞాపకం. తెలియని వారికి ఎలాగూ తెలియదు. తెలిసినవారికి ఎలాగూ తెలుసు. ఇంక ఈ వివరణలన్నీ ఎవరికోసం. వాదనకోసమా అని. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మరిన్ని ఉదాహరణలు, వివరణలు మరింత జ్ఞానధనులు ఇచ్చినా, మరి వీటి సంగతి ఏమిటి అని మరిన్ని ప్రశ్నలు వస్తాయి. అంతేకానీ, అందులో సమాధానం ఉంది – మనం తెలుసుకోవాలి అన్న కుతూహలం మాత్రం కలగదు.
- నేను చెప్పదలుచుకున్నదేమిటంటే మహాభారత రామాయణాలు మన సంస్కృతికి పట్టుగొమ్మలు. అవి మానవజీవన వికాసానికి అనంత సాగరాలు. అందులో ఒడ్డున నిలబడి చిల్లుగవ్వలు ఏరుకునేవారిని ఏమనగలం? పోనీ కొంచెం మధించినతరువాత అందులో హాలాహలం వస్తుంది. ఆ తరువాతకదా అమృతం ఉద్భవించేది? ఇక్కడ అమృతం ఉద్భవించడానికి కొన్ని pre-requisites ఉన్నాయి. మొదటగా మహావిష్ణువు ఇరుసు. (కూర్మావతారం). ఈ ఇరుసు ఏమిటంటే అందులో అమృతం ఉందనే నమ్మకం. అది లేనినాడు మథించడమే సాధ్యం కాదు. మథించినా హాలాహలమే జనిస్తుంది.
మనవడా, కాబట్టి ఆ ఇతిహాసాలు నీకు నిజంగా జ్ఞానాన్ని ప్రసాదించగలవు అన్న నమ్మకంతో చదువు. నేను రాజుని, నా దగ్గరకే జ్ఞానం రావాలి అంటే కుదురుతుందా? అది నీకు అర్హత ఉందో లేదో చూసి మరీ వస్తుంది. ఊరికే రాదు. ముందు నీలో హాలాహలాన్ని రేపుతుంది. అయినా నమ్మకం కోల్పోకుండా మథనం సాగించిననాడు నీ హృదయసాగరంలో అమృతం జనిస్తుంది. ఈ క్షణమే ఆ అమృతం నా గొంతులో పడాలి అనేంతగా ఈ దాహం మిమ్మల్నందర్నీ దహించాలని మనసారా కోరుకుంటున్నాను .. కాదు, కాదు, ఆశీర్వదిస్తున్నాను.